కమల్తో క్రేజీవాల్ భేటీ
జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెన్నై వెళ్లి ప్రముఖ నటుడు కమల్హాసన్ను కలుసుకోవడం ప్రాధానత్య సంతరించుకుంది. కమల్ రెండవ కుమార్తె అక్షర స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి కేజ్రీవాల్ను ఆహ్వానించి ఇంటికి తీసుకువచ్చారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు కమల్హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన కేరళ వెళ్లి ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సమావేశమయ్యారు. కమల్తో కేజ్రీవాల్ గంటసేపు చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమల్హాసన్కు తాను అభిమానినని, ఆయన రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆయన మాటమీద నిలబడే మనిషని, ఇకముందు కూడా ఇదే విధంగా తరచూ కలుస్తామని తెలిపారు. కమల్సన్ మాట్లాడుతూ దేశంలో లంచగొండితనాన్ని రూపుమాపాలని, లౌకికవాదం పరిఢవిల్లాలనే ఆమ్ ఆద్మీ ఆలోచనా విధానం, తన విధానం ఒకటేనని అన్నారు.













