బెంగాల్లో మమత వర్సెస్ అధీర్ రంజన్

పశ్చిమబెంగాల్లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య పోరు మరింత తీవ్రమైంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. టీఎంసీ అధినేత మమతా బెనర్జీపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ అగ్రనాయకత్వం సంయమనం పాటించమని సూచించినా.. అంగీకరించనని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ గురించి ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా మాట్లాడలేనని పేర్కొన్నారు. గతంలో అధిర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పందించిన గంటల వ్యవధిలోనే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
‘‘నన్ను, కాంగ్రెస్ను రాష్ట్రంలో రాజకీయంగా అంతం చేయాలనుకునేవారి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ సానుకూలంగా మాట్లాడలేను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోసం పోరాడుతా. వారి పక్షానే మాట్లాడుతా. మమతా బెనర్జీపై వ్యక్తిగత కక్ష లేదని..అయినా, ఆమె రాజకీయ నైతికతను ప్రశ్నిస్తాను’’ అని అధిర్ పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై కూడా అధిర్ స్పందించారు. ‘‘ఆమె వ్యక్తిగత అజెండా, మా పార్టీ నాశనం కోసం పనిచేయాలనుకోవడం లేదు. ఒక వేళ ఖర్గే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగా స్పందించినా.. నేను మాత్రం క్షేత్ర స్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తల కోసం మాట్లాడుతూనే ఉంటానన్నారు అధీర్. ఇండియా కూటమి నుంచి పారిపోయిన మమతా బెనర్జీని నమ్మలేమన్నారు. ఆమె బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. పురులియా, బంకురా, ఝార్గ్రామ్లో లెఫ్ట్ పార్టీలను ఓడించేందుకు మమతా బెనర్జీ మావోయిస్టుల సాయం తీసుకొన్నారని ఆరోపించారు అధీర్.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
‘‘మమతా బెనర్జీ ఇండియా కూటమితోనే ఉన్నారు.. ప్రభుత్వంలో ఆమె చేరాలా? వద్దా? అనే అంశంపై అధిర్ రంజన్ నిర్ణయం తీసుకోరు. దీనిని నేను, పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తాం.. ఇది ఇష్టం లేనివారు బయటకు వెళ్లిపోవచ్చు’’ అని కఠినంగా వ్యాఖ్యానించారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. తమ పార్టీ ఇండియా కూటమిలోనే ఉందన్నారు. తరచూ మమతను విమర్శిస్తున్న అధిర్.. బీజేపీకి ప్రాణవాయువు అందిస్తున్నారని విమర్శించారు.