అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవు
అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రసింగించిన ఆయన నాటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు. ఇకపై అయోధ్య ప్రక్రియకు ఎవరూ అడ్డంకిగా మారరు. అయోధ్య వీధులు బుల్లెట్ల మోతతో ప్రతిధ్వనించవు. కర్ఫ్యూ ఉండదు. ఇప్పుడు దీపోత్సవం, రామోత్సవాలు జరుగుతాయి. రామకీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఈ రోజు ఇక్కడ జరిగిన రామ్ లల్లా ప్రతిష్ఠాపన రామరాజ్యం స్థాపనను సూచిస్తుంది అని అన్నారు. కాగా, 1990లో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం హయాంలో అయోధ్యలో ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 17 మంది కరసేవకులు మరణించారు. యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రామ మందిరం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు.













