50,000 మెజారిటీతో మమతను ఓడిస్తా… లేదంటే…
సీఎం మమతా బెనర్జీ ‘నందిగ్రామ్’ ప్రకటనతో బెంగాల్ రాజకీయం తన రంగును మార్చుకుంది. ఇన్ని రోజులు మమతా, సుబేందు పరోక్షంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఒకే ఒక్క ప్రకటనతో ‘కాచుకుందాం రా…’ అన్నంతగా రాజకీయాలు వేడెక్కాయి. తాను నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించిన కొద్ది గంటలకే బీజేపీ నేత సుబేందు అధికారి ప్రతి సవాల్ విసిరారు. కోల్కతాలో జరిగిన ఓ ర్యాలీలో సుబేందు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మమతను 50,000 ఓట్ల మెజారిటీతో ఓడించి తీరుతానని సవాల్ విసిరారు. లేదంటే రాజకీయాల నుంచే వైదొలుగుతానని భారీ సవాల్ విసిరారు. తృణమూల్ అసలు రాజకీయ పార్టే కాదని, అదో ప్రైవేట్ కంపెనీ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం వస్తేనే సీఎం మమతకు నందిగ్రామ్ గుర్తొస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు నందిగ్రామ్లో తృణమూల్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. సీఎం, ఆమె అవినీతి అల్లుడు, తృణమూల్ అనే ప్రైవేట్ కంపెనీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందని, మమతను నందిగ్రామ్ ఎన్నటికీ మరిచిపోదని సుబేందు హెచ్చరించారు.













