కరోనాతో ఉద్యోగి మరణిస్తే…వారి ఫ్యామిలీకి

పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులకు ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని టాటా స్టీల్ ప్రకటించింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా వారికి ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు టాటా స్టీల్ తమ ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం కొనసాగించేందుకు తమ వంతు సాయం చేస్తామని ప్రకటించింది. ఒక వేళ మా ఉద్యోగి కరోనాతో మరణిస్తే, సదరు ఉద్యోగి కుటుంబానికి వేతనం అందజేస్తామని టాటా తెలిపింది.
ఉద్యోగి మరణించే నాటికి ఎంత వేతనం పొందుతున్నారో.. అంతే మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏండ్లు నిండే వరకు వారి ఫ్యామిలీకి అందిస్తామని తెలిపింది. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా కూడా చూస్తామని తెలిపింది. ఒక వేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడి, సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంత వరకు ఖర్చులనీ కూడా మేమే భరిస్తాం అని సోషల్ మీడియా వేదికగా టాటా వెల్లడించింది. ఈ సందర్భంగా టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.