కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ …
కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కోసం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణం కోసం తెచ్చిన అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నట్లు అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో వెలువరించింది. ప్రాజెక్టును ఆపేందుకు చట్టబద్దంగా ఎలాంటి అడ్డంకులు లేవని కోర్టు చెప్పింది. పర్యావరణ అనుమతులపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన క్లియర్స్ సృష్టంగా ఉన్నట్లు కోర్టు తెలిపింది. సెంట్రల్ విస్టా పనులపై నమోదు అయిన కేసులో త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతుల్లో ఎటువంటి లోపాలు లేవని బెంచ్ పేర్కొన్నది. రీడెవలప్మెంట్ ప్లాన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యే సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ ప్రాజెక్టుపై ఉన్న కేసులో కోర్టు తీర్పు వచ్చే వరకు పనులు చేపట్టబోమని కేంద్రం పేర్కొన్నది. భవన నిర్మాణం కోసం స్థలం మార్చడాన్ని ఇచ్చిన అనుమతులను తప్పుపడుతూ పిటీషనర్లు కోర్టును ఆశ్రయించారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించారు. తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రాజెక్టుకు ఓకే చెప్పగా, ఒకరు వ్యతిరేకించారు. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ప్రాజెక్టుకు నిర్మాణం కోసం భూ వినియోగంపై మాత్రం జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రభుత్వంతో వ్యతిరేకించారు.













