డిసెంబర్ 10న సాయిబాబా లక్షగళ మహా శేజహారతి
షిర్డీలోని సాయిబాబాను ఆరాధిస్తూ ఎంతోమంది హారతి పాటల రూపంలో ప్రతిరోజు నాలుగుసార్లు ప్రార్థన చేస్తుంటారు. సామూహికంగా చేసే ఈ ప్రార్థన ఎంతోమందిని ఆనందపరవశులను చేస్తోంది. దీనినే దీక్షగా చేస్తే ఇంకా మధురానుభూతి కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న విపత్కర సంక్షోభ కాలంలో భక్తులు సులభంగా ఇంట్లో నుంచే సాయిని స్మరిస్తూ చేయగల కార్యక్రమం శ్రీ సాయి రక్ష హారతి దీక్ష. 40రోజులపాటు ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని సాయిబాబా అనుగ్రహం పొందాలని, డిసెంబర్ 10న జరిగే హారతి సాయిబాబా- లక్షగళ మహా శేజ హారతిలో భక్తులంతా పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ఈ కార్యక్రమ కన్వీనర్ సాయి శ్రీనివాస్ కోరారు.
1910 డిసెంబర్ 10న ప్రారంభించిన ఈ హారతి సేవ రాబోయే డిసెంబర్ 10వ తేదీ 2020 నాటికి 110 సంవత్సరముల జన్మదిన వేడుకలకు సిద్ధమవుతోంది. ఆనాడు బాబావారి ఆశీర్వాదముతో మొదలైన హారతి నేటికీ ఎంతోమందిని భక్తిమార్గంలో నడిపిస్తున్నది. లక్షలాది మంది భక్తులు తమ మనసే హారతిగా, ఈ సేవను ఎంతో భక్తి ప్రేమలతో కొనసాగిస్తున్నారు. బాబావారి ప్రేరణతో, వారి అనుమతితో ప్రారంభమైన సేవయే ఈ హారతి. సాయి భక్తుల పాలిటి వరదాయని, బాబావారు, హారతి సాయిబాబా అనే పాట వ్రాసిన మాదవ్ అడ్కర్ కు మగబిడ్డను అనుగ్రహించారు. జగేశ్వర భీష్మకి కలలో స్వప్న సాక్షాత్కారాన్నిచ్చి, తన దగ్గరకు రప్పించుకొని ప్రేరణ కల్పించి ఈ హారతి పాటలు వ్రాయించారు. నానా కూతురు మైనతాయికి హారతి సాయిబాబా పాట ద్వారా సుఖప్రసవమై పునర్జన్మ పొందింది. ఈ హారతి పాటలు లక్షలాది మందికి దివ్యానుగ్రహాన్ని కలిగించాయి. ఉత్తర కాలంలో దాసగన్ మహారాజ్, బి.వి.దేవ్, మరికొందరి భక్తుల పాటలు జతచేసి సాయి పాదాలకు సమర్పించారు. అలా సాయిబాబా వారు ప్రేరణ కల్గించి, వ్రాయించి, వాటిని విని ఆమోదించిన ఆ పాటలు నేడు దివ్యమంత్రాలుగా భక్తుల హృదయ మందిరాలలో ప్రతి నిద్యం ప్రతి ధ్వనిస్తున్నాయి.
అనేక మంది భక్తులు, ఉపాసకు అనుభవం మీద చెప్పిన ఫలశృతి ప్రకారము నాలుగు హారతులు దీక్షగా చేసిన వారికి అనేక ప్రయోజనములు కలుగుతున్నాయి. అనారోగ్య, నవగ్రహ, ఆర్థిక మరియు కుటుంబ సమస్యల నుండి విముక్తి, మనశ్శాంతి, శ్రీష్రు కార్యసిద్ధి, సద్గురు అనుగ్రహం కలిగి సత్వరమే సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.
శ్రీ సాయిబాబావారి దివ్యాశీస్సులతో షిర్డీసాయి సంస్థాన్ వారి సంపూర్ణ సహాయ సహకారాలతో, సాయిలీల హిందీ, తెలుగు టి.వి.ల ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా అత్యంత నాణ్యమైన టెక్నాలజీతో, ప్రతీరోజు 4 హారతులు భక్తులు వీక్షించేందుకు అవకాశం కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడేందుకు 2020 సం।। డిసెంబర్ 10వ తేదీన శ్రీ సాయి హారతి 110 సంవత్సరాల ఉత్సవాలను ఆన్లైన్ ద్వారా సాయి భక్తులతో కలిసి నిర్వహించాలని సాయిలీల టి.వి. ఈ మహత్తర కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది.
శ్రీ సాయిరక్ష- హారతి దీక్ష
దీక్షాకాలం 1-11-2020 నుండి 10-12-2020 వరకు
ఆచరించవలసిన నియమాలు :
1. షిర్డీసాయి బాబావారి నాలుగు హారతులలో ఏదో ఒక హారతిలో ప్రతీరోజు పాల్గొనవలెను.
2. అన్ని ఓటీటీ ప్లాట్ ఫారంలలో, యూట్యూబ్, ఫేస్బుక్, జీ మొదలైన ఆప్లలో షిర్డీ నుండి సాయిలీల హిందీ తెలుగు టి.వి. ఛానెల్స్ ద్వారా ప్రతిరోజు నాలుగు హారతుల ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చును.
3. మొదటి రోజు నుండి నలభై రోజులపాటు క్రమం తప్పకుండా చూసే వారికి, షిర్డీ నుండి ప్రత్యేక బహుమతులు పంపడం జరుగుతుంది.
4. లాటరీ ద్వారా ఎంపిక చేసి, ఎంపికయిన వారిని షిర్డీ యాత్రకు ఉచితంగా తీసుకుని వెళ్లి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది.
5. డిసెంబరు 10వ తేదీ 2020 శేజహరతిలో ఆన్లైన్ ద్వారా ఒక్కరోజున లక్ష మంది పాల్గొని గిన్నిస్ పుస్తకంలో హారతి సాయిబాబా పేరు నమోదు చేయాలని సంకల్పించాము. శ్రీ సాయిబాబా వారి ఆశీర్వాదముతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితుల నుండి విముక్తి లక్ష్యంగా ఈ కార్యక్రమము రూపొందించడం జరిగింది. అందరూ పాల్గొనవచ్చు.
6. నవంబర్ 1వ తేదీ నుండి ప్రపంచంలో ఎక్కడ నుండైన, మీరు హారతిలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు తమ పేరు, ప్రదేశం, ఫోన్ నెం. ఈ మెయిల్ వివరాలను నమోదు చేయించుకోవాలి.
7. డిసెంబర్ 10వ తేదీన, అందరూ సాయిలీల హిందీ, తెలుగు టి.వీల ద్వారా మా వెబ్సైట్ ద్వారా శేజ హారతిలో పాల్గొనవలెను.
8. ఆసక్తి ఉన్న వారు మేము ఇచ్చిన ఈమెయిల్కి మీ వివరాలు తెలియ చేయాలని కోరుతున్నాము. త్వరలో మా వెబ్సైట్ ద్వారా అందరికీ రి.నెం. ఇవ్వబడును.
9. ప్రతి ఒక్కరూ 40 రోజులు పాల్గొనాలి అని నియమం లేదు. మీ అవకాశమును బట్టి పాల్గొనవచ్చును. దీక్షగా చేయాలని నియమం పెట్టుకున్నవారు మాత్రం క్రమం తప్పకుండా 40 రోజుల పాటు ఏదో ఒక హారతిలో పాల్గొనవలెను.
10. గిన్నిస్ బుక్ రికార్డ్లో నమోదు కోసం ప్రతివారు డిసెంబర్ 1 తేదీ ముందుగా మీ వివరాలు నమోదు చేసుకోవలెను. నమోదైన వివరాలు గిన్నీస్ బుక్ రికార్డు కోసం పంపవలసి ఉంటుంది. అందువలన డిసెంబర్ 10న శేష హారతిలో పాల్గొన దలచినవారు తమ వివరాలు ముందుగా నమోదు చేసుకొనవలెను.
11. ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆన్లైన్ హారతిలో, ఏక కాలంలో లక్షమంది పాల్గొనలేదు. సాయి భక్తులు తలుచుకుంటే ప్రపంచ చరిత్రలో షిర్డీసాయి హారతి ఖ్యాతి సువర్ణ అక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతుంది. శ్రీ సాయి మనతో చేయిస్తున్న అద్భుతమైన కార్యక్రమం హారతి దీక్ష ఇదే అవుతుంది. మనందరికీ రక్ష, బాబావారి అనుగ్రహముతో, సాయిలీల టీ.వి హిందీ, తెలుగు సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో పాల్గొని, ఆనాడు కలరా మహమ్మారిని, ప్లేగువ్యాధిని తరిమేసినట్లుగా ఈ కరోనాను కూడా పారద్రోలి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంక్లిష్టమైన పరిస్థితుల నుండి విముక్తి కల్పించాలని శ్రీ సాయిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామని కన్వీనర్ సాయి శ్రీనివాస్ కోరారు.













