కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లోట్.. సీఎం పదవి పైలట్ కే?
త్వరలో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోట్ పోటీ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరనే అంశంపై తెగ చర్చలు జరుగుతున్నాయి. గెహ్లోట్ స్ధానంలో మరో కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కు ఈ పదవి దక్కుతుందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రతుతం భారత్ జోడో యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో పాల్గొనేందుకు సచిన్ పైలట్ కేరళ వచ్చారు. ఈ సందర్భంగా ఈ అంశంపై పెదవి విప్పారు. తనకు పార్టీ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా తాను నిర్వర్తిస్తానని పైలట్ చెప్పారు. అశోక్ గెహ్లోట్ సీనియర్ నేత అని, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పిన పైలట్.. వచ్చే ఏడాది జరిగే రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. తదుపరి రాజస్ధాన్ సీఎం ఎవరనే ప్రశ్నకు బదులిస్తూ.. కాంగ్రెస్ నాయకత్వం ఏ బాధ్యతలు ఇచ్చినా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఇటీవల అశోక్ గెహ్లొట్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష రేసులో గెహ్లోట్ ఉన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల కోసం ఆయన ఇంకా నామినేసన్ దాఖలు చేయలేదు. ఇక గెహ్లోట్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే సీఎం పదవి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సచిన్ పైలట్కే ఈ పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.













