అక్రమార్జనలేమీ లేవు : రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వివరణ

అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైన కొన్ని రోజులకే విమర్శలు చుట్టుముట్టాయి. ఆలయ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆలయ నిర్మాణ భూములకు సంబంధించిన క్రయ విక్రయాల పత్రాలను సమాజ్వాదీ పార్టీ నేత బయటపెట్టారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఓ భూమిని మధ్యవర్తులు 2 కోట్లకు కొన్నారని పేర్కొంటూ, కొనుగోలు చేసిన కాసేపటికే దానిని 18.5 కోట్లకు అమ్మారని ఆరోపించారు. ఇలా దాదాపు 16 కోట్లకు పైగా అక్రమ ఆర్జన జరిగిందని ఎస్పీ నేత ఆరోపణలు గుప్పించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని సమాజ్వాదీ డిమాండ్ చేసింది.
స్పందించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
అయోధ్య రామాలయ నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ స్పందించారు. ఆ ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించన ఆరోపణలని, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడ్డారు. 2019 లో సుప్రీం కోర్టు అయోధ్యపై తీర్పు వెలువరించగానే దేశవ్యాపితంగా ఉన్న ప్రజలందరూ అయోధ్యకు వచ్చి, భూములు కొనడం ప్రారంభించారని, అందుకే ధరలు పెరిగాయని వివరించారు. తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించి ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన భూములన్నీ బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయబడ్డాయని తెలిపారు. తీర్థక్షేత్ర ట్రస్ట్ కోసం భూముల అమ్మకం, కొనుగోళ్ల ప్రక్రియ రెండు వర్గాల సంప్రదింపుల తర్వాతే జరిగిందని, ఆ తర్వాతే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశామని అన్నారు. అన్ని రకాల కోర్టు ఫీజులు, స్టాంపు పత్రాలను తాము ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ఒప్పంద పత్రంపై సంతకాలు చేసిన తర్వాతే సంబంధిత భూమిని కొనుగోలు చేశామని, మొత్తం డబ్బును కూడా ఆన్లైన్ ద్వారా సంబంధిత వ్యక్తికి ఇచ్చామని చంపత్ రాయ్ తెలిపారు.