ఆ నోటీసులకు కట్టుబడి ఉంటా : రాహుల్ గాంధీ
ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లా ను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటీసులపై తాజాగా రాహుల్ స్పందించారు. తన హక్కులకు భంగం కలగకుండా, ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటానని అన్నారు. అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాహుల్ లేఖ రాశారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నేను ఇక్కడే గడిపాను. ఈ భవనంతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. వాటన్నింటికీ ప్రజలే కారణం. వారికి రుణపడి ఉంటాను. నా హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటాను. అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తాను అని రాహుల్ పేర్కొన్నారు. 2019 పరువు నష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్కు రెండేండ్లు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో రాహుల్ పై లోక్సభ సెక్రటేరియట్ ఎంపీ అనర్హత వేటు వేశారు. దీంతో పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్సభ హౌసింగ్ కమిటీ రాహుల్కు నోటీసులు ఇచ్చింది.













