ఉప ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం
ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విజయం సాధించారు. దీంతో ఆయన తన సీఎం స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. చంపావత్ నియోజకవర్గం నుంచి ధామి గెలుపొందారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుష్కర్ సింగ్ ధామి పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో 55,025 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై ఆయన విజయం సాధించారు. నిజానికి ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహించారు.
కానీ రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోగా ఆయన ఏదైనా స్థానం నుంచి గెలిచి మళ్లీ అసెంబ్లీ సభ్యుడిగా మారాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చంపావత్ స్థానం నుంచి పుష్కర్ సింగ్ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు. గతంలో ఈ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ గెహతోరి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల నిర్వహించారు. రికార్డు స్థాయిలో విజయాన్ని నమోదు చేసిన పుష్కర్ సింగ్కు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు.













