న్యూజిలాండ్ మంత్రిగా భారతీయురాలు …
న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక రాధాకృష్ణన్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. న్యూజిలాండ్లో మంత్రి స్థాయికి ఎదిగిన మొట్టమొదటి భారతీయురాలు ప్రియాంక కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డెర్న్ కు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ సోమవారం కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించారు. తాజాగా ఆ దేశ కేబినెట్లో ప్రియాంక చోటు దక్కించుకున్నారు.
ప్రియాంక రాధాకృష్ణన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్. రామన్ రాధాకృష్షన్, ఉషా దంపతులకు ఆమె జన్మించారు. అనంతరం ఆ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ప్రియాంకా విద్యాభ్యాసం సింగపూర్, న్యూజిలాండ్లో కొనసాగింది. ఆ తర్వాత ఆమె క్రైస్ట్చర్చ్కు చెందిన రిచర్డ్సన్ ను వివాహమాడింది. 2004 నుండి లేబర్ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు. 2017లో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంట్లో ప్రవేశించిన ప్రియాంక, వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేశారు.













