అట్టహాసంగా ప్రారంభమైన నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్
రిలయన్స్ ఫౌండేషన్స్ చైర్పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ ఎన్ఎంఏసీసీ (నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్) ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవాలు మూడురోజులపాటు జరగనున్నాయి. మొదటి రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ సినీ పరిశ్రమలకు చెందిన తారలు ఈ వేడుకల్లో సందడి చేశారు.
అగ్రనటుడు రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ఖాన్, కుమార్తె సుహాన్ ఖాన్, సల్మాన్ఖాన్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ ఆయన సతీమణి మీరా రాజ్పుత్, సిద్ధార్థ్ మల్హోత్రా`కియారా అడ్వాణీ దంపతులు, దీపికా పదుకొణె“రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్, శ్రద్ధాకపూర్, జాన్వీకపూర్, సోనమ్ కపూర్, అలియాభట్ కుటుంబం, ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్గా ఎన్ఎంఏసీసీ ప్రాచుర్యం పొందింది. భారతీయ సంస్కృతి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆమె దీనిని ప్రారంభించారు. ఈ నాలుగంతస్తుల భవంతిలో ఒక మ్యూజియం, 2000 మంది సామర్థ్యంతో కూడిన థియేటర్, ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్కు ప్రత్యేక స్థలం, స్టూడియో థియేటర్ ఉన్నాయి.













