రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటోడ్రైవర్
కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ జాక్ పాట్ కొట్టాడు. ఓనం బంపర్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. టికెట్ కొనుగోలు చేసిన అతడికి భారీ మొత్తంలో లాటరీ తగలడం విశేషం. అనూప్ శ్రీవరాహం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. టికెట్ కొనేందుకు వెళ్లిన అతడు తొలుత వేరే టికెట్ను తీసుకున్నాడు. తర్వాత దాన్ని వెనక్కి ఇచ్చేసి మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడు అదే టికెట్ రూ.25 కోట్లు తెచ్చిపెట్టింది. పన్నులు చెల్లించిన తర్వాత అనూప్ చేతికి రూ.15 కోట్లు రానున్నాయి. ఈ డబ్బుతో కొత్త ఇంటిని నిర్మించుకుంటానని, అప్పులను తీర్చేస్తానని తెలిపాడు.
నిజానికి అనూప్ విదేశాలకు వెళ్లే ప్రణాళికలో ఉన్నాడు. మలేసియాలో షెఫ్గా పని చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారమే అతడికి బ్యాంకు రుణం మంజూరు అయింది. ఇందుకోసం బ్యాంకు అధికారులు తనకు ఫోన్ చేయగా, తనకు లోన్ వద్దని చెప్పానని అనూప్ వివరించాడు. ఇప్పుడు మలేసియా వెళ్లాలన్న నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్లు తెలిపారు.













