విమానయాన సంస్థలో తొలి మహిళా సీఈవో
భారత విమానయాన సంస్థలో తొలి మహిళా సీఈవోగా హర్ప్రీత్ ఎ దే సింగ్ నియమితులయ్యారు. ఎయిర్ ఇండియా (ఐఎ) ప్రాంతీయ అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్కు సీఈవోగా ప్రభుత్వం ఆమెను నియమించింది. ఏఐ సీఎండీ రాజీవ్ బన్సాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాల వరకు అలయన్స్ ఎయిర్ సీఈవోగా హర్ప్రీత్ వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (విమాన భద్రత)గా ఉన్నారు. ఆమె స్థానాన్ని కెప్టెన్ నివేదా భాసిన్ భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1988లో ఎయిర్ ఇండియా తొలి మహిళా పైలట్గా హర్ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. అనంతరం అనారోగ్య కారణాల వల్ల పైలట్గా రాణించలేకపోయినా విమాన భద్రత విభాగం విధుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారత మహిళ పైలట్ సంఘానికి అధిపతిగాను ఉన్నారు.













