మాజీ సీఎం ప్రతాప్ సింగ్ రాణేకు అరుదైన గౌరవం
గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణేకు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు ఆ రాష్ట్ర కేబినెట్లో శాశ్వత హోదా కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాణే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున పొరియం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పదవితో కలిసి ఆయన ఎమ్మెల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా, స్పీకర్గా కూడా సేవలు అందించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాణేకు కేబినెట్లో హోదా ఇవ్వాలని గోవా ప్రభుత్వం నిర్ణయించినట్టు తాజా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఇక నుంచి ఎమ్మేల్యేగా 50 ఏళ్లు పూర్తి చేసుకుని ముఖ్యమంత్రులుగా స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారందరికీ కేబినెట్లో శాశ్వత హోదా కల్పిస్తామని సీఎం సావంత్ తెలిపారు. రాణే 1987 నుంచి 2007 వరకు నాలుగు సార్లు సీఎంగా పని చేశారు. రాణే 50 ఏళ్ల ప్రజా సేవను గుర్తించినందుకు గోవా ప్రభుత్వానికి ఆయన కుమారుడు విశ్వజీత్ ధన్యవాదాలు తెలిపారు.













