‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్’ మరో 90 రోజులు పొడిగింపు..
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేకంగా అందిస్తున్న ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్’ ప్యాకేజీ బీమా సౌకర్యాన్ని మరో 90 రోజులపాటు పాడిగించారు. కోవిడ్-19 వైరస్ కు చికిత్స అందిస్తున్న సిబ్బందికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. కరోనా వైరస్ రోగులకు వీరు చికిత్స అందిస్తున్న సమయంలో వీరికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందువల్ల ఈ బీమా పథకం తీసుకురావడమైనది. ఈ బీమా పథకం కింద 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం లభిస్తుంది. కరోనా సోకి ఈ పధకం లబ్ధిదారులు ఎవరైనా మరణిస్తే రూ.50లక్షలు పరిహారం అందుతుంది. అర్హులు వీరే… ఈ ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ లబ్ధి దారుల్లో వైద్యులు, వైద్య నిపుణులు, ఆశా వర్కర్లు, పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, వార్డు బాయ్ లు, పారిశ్యుద్ధ్య కార్మికులు, రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించే సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించిన ఆరోగ్య కేంద్రాలతో పాటు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎయిమ్స్, ఐఎన్ఐలు, వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల పరిధిలో పనిచేసే ఆస్పత్రుల్లోని ఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తుంది. ఆయా సిబ్బందికి ఇప్పటికే వేరే ఏవైనా ఇన్సూరెన్స్ లు ఉన్నప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా అదనంగా ఈ బీమా వర్తిస్తుంది.
అంతేకాకుండా డైరెక్టర్ లేదా మెడికల్ సూపరింటెండెంట్/ హెడ్ ఆఫ్ ద ఇనిస్టిట్యూషన్ ఆమోదించిన ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థలకు, కూడా ఇది వర్తిస్తుంది. కోవిడ్ వైరస్ చికిత్సలో పనిచేసిన సిబ్బందికి కాంట్రాక్టు నియామకాల నిబంధనలకు అనుగుణంగా భవిష్యత్తులో జరిగే నియామకాల్లో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.













