సిఇసీగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ కుమార్
భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)గా రాజీవ్ కుమార్ నిర్వచన్ సదన్లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సిఇసిగా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రాజీవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో రాజీవ్ కుమార్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నియమాకం 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజీవ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం అందించిన అత్యుత్తమ సంస్థల్లో ఒకటైన సంస్థకు నాయకత్వం వహించే బాధ్యత స్వీకరించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. పౌరులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు, ఓటర్ల జాబితాలో నాణ్యత పెంచేందుకు సిఇసి కృషి చేసిందని తెలిపారు.













