హిమాచల్ప్రదేశ్ ఎన్నికలకు మోగిన నగారా
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఆ రాష్ట్రంలో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమీషన్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హిమాచల్ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరుగనుందన్నారు. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 27 వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
కాగా, హిమచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి 45 మంది, కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. 2023 జనవరి 8న హిమాచల్లో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.













