కేజ్రీవాల్ కు భారీ ఊరట
ఢిల్లీ హైకోర్టులో ఓ కీలక అంశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. జైల్లో ఉన్న ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిల్ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్ద అనే అంశంపై కేజ్రీవాల్ వ్యక్తిగతంగా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బెంచ్ తెలిపింది. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది.
ప్రభుత్వం పనిచేయట్లేదని మేం ఎలా తేలుస్తాం. ఎల్జీ ఇందుకు సరైన వ్యక్తి. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. ఆయనకు సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేదు. చట్ట ప్రకారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్కు రాష్ట్రపతి, ఎల్జీ వద్ద పరిష్కారం దొరుకుతుందని సూచించారు. కేజ్రీవాల్ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిల్ దాఖలు కావడం ఇది రెండోసారి. సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి గత నెల 28న దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం కొట్టేసింది.













