కాంగ్రెస్ ప్లీనరీ అప్పుడే… కొత్త అధ్యక్షుడి ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం మే నెలలో ఏఐసీసీ ప్లీనరీ నిర్వహించనున్నది. మే 15వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య సమావేశాలు జరిగే అవకాశం ఉన్నది. ఏఐసీసీ ప్లీనరీ మే 29వ తేదీన జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరిలోనే పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మేలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
రైతుల ఆందోళనలతో పాటు కరోనా మహమ్మారిపై అమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ త్వజించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ చీఫ్గా మళ్లీ సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు. కానీ ఇటీవల ఆ పార్టీలో సీనియర్లు సోనియాకు వ్యతిరేకంగా గళం ఎత్తారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఏఐసీసీ ప్లీనరీ నిర్వహించనున్నది.













