కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… ఐబీ, రా, డిఫెన్స్
కీలక విభాగాల అధిపతుల పదవీకాలం పొడిగింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని అయిదేళ్ల వరకు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ రెండు ఆర్డినెన్సులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రక్షణ, హోం శాఖల కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్ (రా) డైరెక్టర్ల పదవీకాలాన్నీ రెండేళ్లపాటు పొడిగించడానికి అవకాశం కల్పించేలా ప్రాథమిక నిబంధనలు (ఫండమెంట్ రూల్స్) 1922లోని రూల్-56ను సవరించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, రక్షణ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజా ప్రయోజనం ఉన్నట్లు భావిస్తే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ, హోం శాఖ, ఐబీ, రా, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదీకాలాన్ని పొడిగించొచ్చని అందులో పేర్కొంది. ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి, ఎంత కాలం వరకు పొడిగించవచ్చో విశ్లేషించి అంత వరకు పొడిగించడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పదవీకాలం పొడిగింపునకు దారితీసిన కారణాలను లిఖితపూర్వకంగా పొందుపరచాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన కింద కార్యదర్శులు, డైరెక్టర్లకు వర్తింపజేసే పదవీకాల పొడిగింపు రెండేళ్లు కానీ, లేదంటే ఈ పదవుల నియామకానికి వర్తించే చట్టాల్లో పొందుపరిచిన గడువుకానీ మించకూడదని షరతు విధించింది.













