విదేశీ ప్రయాణికులకు కేంద్రం.. కొత్త మార్గదర్శకాలు

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అనుసరించవలసిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దశలో కొన్ని దేశాలను రిస్క్ ఎక్కువగా ఉన్నవిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా ఈ రిస్క్ కేటగిరీని ప్రభుత్వం తొలగించింది. ముఖ్యంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ అవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. దీని స్థానంలో విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు లక్షణాలను పరిశీలించుకుంటూ ఉండాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఈ నెల 14 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటిచింది.
మారుతున్న కరోనా వైరస్ తీరును గమనిస్తూ ఉండాలని, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూడవలసిన అవసరం ఉందని సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, విదేశాల నుంచి వచ్చే వారు స్వీయ ధ్రువీకరణను ఆన్లైన్లో సమర్పించవలసి ఉంటుంది. ఎయిర్ సువిధ పోర్టల్లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. కరోనా నెగటివ్ అంటూ ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్ను సమర్పించాలి. లేదంటే తాము రెండు డోసుల టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ నిబంధనలను పాటించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని ఎయిర్లైన్స్ సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.