కేంద్రం కీలక నిర్ణయం.. 18 నుంచి 21 ఏళ్లకు
మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్ర కేబినెట్ భేటీలో యువతుల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువతుల వివాహ వయసు పెంచుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసందే. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరమని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అబ్బాయిల వివాహ కనీస వయసు 21 ఏళ్లు, అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. జయ జైట్లీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ టాస్క్ఫోర్స్ అమ్మాయిల కనీస వివాహ వయసు ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది. స్త్రీలకు మొదటి గర్భధారణ సమయంలో కనీసం 21 ఏళ్లు ఉండాలని టాస్క్ఫోర్స్ చెప్పడంతో ఈ ప్రతిపాదనపై డిసెంబర్ నెలలోనే సిఫారసులు సమర్పించారు.













