మమతా బెనర్జీకి భారీ షాక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సీనియర్ నాయకుడు, రెబెల్ రవాణ శాఖ మంత్రి సువేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాక్ తగిలినట్టయింది. కీలక పదవికి రాజీనామా చేసిన ఆయన తాజాగా మంత్రి పదవికి గుడ్బై చెప్పారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. తన రాజీనామాను వెంటనే అంగీకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేశానని లేఖలో పేర్కొన్నారు.













