కేంద్రంలో బిజెపి ప్రత్నామ్నాయం ఆఫ్ పార్టీనేనా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో దేశంలో కాంగ్రెస్ పని ముగిసినట్లేనని చెబుతున్నారు. దేశంలో బీజేపీకి ఎదురులేదని తేలిపోయింది. దేశంలో బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీని దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీ లో వరుసగా మూడుసార్లు ఓడించింది ఆప్ పార్టీ. ఇక పంజాబ్ లోనూ కాంగ్రెస్ ను చిత్తు చేసి ఏకంగా రెండు రాష్ట్రాల్లో అధికారం సంపాదించింది. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లను చేజిక్కించుకుంది. పంజాబ్ లో కేజ్రీవాల్ పార్టీ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా ఫలితాల్లో అధికారం వైపు ఆప్ దూసుకుపోతోంది. మొత్తం పంజాబ్ లోని 117 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు 59 సీట్లు అవసరం కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి దూసుకుపోతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లలోనే గెలిచి అధికారానికి దూరమైంది. ఒకప్రాంతీయ పార్టీ అయిన ఆప్ .. రెండు జాతీయపార్టీలు కాంగ్రెస్ బీజేపీలను చిత్తుగా ఓడించి ఓ రాష్ట్రంలో అధికారం కొల్లగొట్టడం నిజంగా గొప్ప విషయమేనని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏకంగా జాతీయనేతగా ఈ ఎన్నికల ఫలితాలతో ఎదగబోతున్నారు. ఇప్పటివరకూ ఢిల్లీకే పరిమితమైన ఆప్.. తాజాగా పంజాబ్ లో కూడా సత్తా చాటడం విశేషం.
పంజాబ్ లో అధికారాన్ని సొంతం చేసుకోవడం ద్వారా దేశ ప్రజానీకాన్ని కేజ్రీవాల్ తనవైపు ఆకర్షించగలిగారు. పంజాబ్ లో కేజ్రీవాల్ పార్టీ సత్తా చాటడంతో దేశ రాజకీయాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే అవకావాలున్నాయి. ఇంతవరకూ బీజేపీకి ప్రత్యామ్మాయంగా పశ్చిమ బెంగాల్ తెలంగాణ సీఎంలు మమతా బెనర్జీ కేసీఆర్ లు తమను తాము ప్రకటించుకున్నారు.కానీ ప్రాంతీయపార్టీ అధినేతగా మరో రాష్ట్రంలో ప్రజాదర పొందిన కేజ్రీవాల్ ఇప్పుడు మోడీకి ప్రత్యామ్మాయ నేతగా దేశం ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ ను కాదని మరో జాతీయ పార్టీగా ఆప్ ను ప్రజలు చూస్తున్నారు.













