ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి : అమిత్ షా
ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 లో అమిత్ షా మాట్లాడారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని ( సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మన ముస్లిం సోదరుల్ని సీఏఏకి వ్యతిరేకంగా తప్పుదోవపట్టిస్తున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లో హింసను ఎదుర్కొని భారత్కు వచ్చినవారికి పౌరసత్వం ఇవ్వడమే సీఏఏ ఉద్దేశం. ఏ ఒక్కరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడం కోసం కాదు అని స్పష్టం చేశారు. సీఏఏ అమలుకు ముందు దానికి సంబంధించిన నిబంధనలను జారీ చేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. మేం ఆర్టికల్ 370ని రద్దు చేశాం. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, మొత్తంగా ఎన్డీయే కు 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అని అమిత్ షా వ్యాఖ్యానించారు.













