మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… జాతీయ భద్రత సలహాదారుగా

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ డోభాల్ ను మరోసారి నియమించింది. ఎన్ఎస్ఏ గా ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ అధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. 2024 జూన్ 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డోభాల్ ఎన్ఎస్ఏగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. పదవీకాలంలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయిస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన సమయంలో 2014 మే 30న డోభాల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు.