షింజో అబె తుది వీడ్కోలుకు హాజరైన… ప్రధాని మోదీ
జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను పూర్తి చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం నేడు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. షింజో చితాభస్మాన్ని టోక్యో హాల్కు తీసుకొచ్చారు. ఇక్కడ వేలమంది ఆయనకు తుది నివాళిని అర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని సమర్పించాలి. జపాన్లో అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకొన్న రెండో నేతగా అబె నిలిచారు.
భారత ప్రధాని మోదీ అంతకు ముందు జపాన్ ప్రధాని పుమియో కిషదతో భేటీ అయ్యారు. అబె మరణానికి మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం భారత్`జపాన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. షింజో తన తొమ్మిదేళ్ల పదవీ కాలంలో నాలుగుసార్లు భారత్ను సందర్శించడం ఓ రికార్డు. 2014 జనవరిలో భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తొలి జపాన్ ప్రధానిగా ఘనత సాధించారు. యూపీఏ అనంతరం అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో బలమైన సంబంధాలు నెరిపారు. భారత్`జపాన్ సంబంధాల్లో మోదీ` అబె శకం ఓ కీలక అధ్యాయం.













