అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు

అమెరికాలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతున్నది. ఆ దేశంలో వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య నాలుగు లక్షలు దాటింది. దేశాధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందే అమెరికా కొత్త మైలురాయిని అందుకున్నది. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కన్నా.. కరోనా వైరస్తో అధిక సంఖ్యలో మృతులు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయం వెల్లడైంది.
గత నెలలో మూడు లక్షలు ఉన్న మరణాల సంఖ్య కేవలం 30 రోజుల్లోనే ఆ సంఖ్య మరో లక్ష దాటడం శోచనీయం. కేవలం ఒక నెలలోనే లక్ష మంది మరణించడం దారుణమని జాన్స్ హాప్కిన్స్ పరిశోధకులు జెన్నిఫర్ నుజ్జో ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 20 లక్షలు దాటింది.