ఏడాది చివరకు వ్యాక్సి’నేషన్’.. భారత్ ముందు భారీ టార్గెట్..!

కరోనా మహమ్మారి సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న దేశ ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్ అందించింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న టీకా కొరతను అధిగమించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరలోనే కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 200 కోట్లకు పైగా వివిధ వ్యాక్సిన్ డోస్లు అందుబాటులోకి రానున్నాయి. డబ్ల్యూహెచ్వో, అమెరికా ఎఫ్డీఏ అనుమతులు పొందిన ఏ విదేశీ టీకాలైనా సరే భారత్కు రావొచ్చని… దిగుమతి లైసెన్సులు అడిగితే రెండ్రోజుల్లో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం తెలిపింది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా టీకా ఉత్పత్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇండియాలోనే జరుగుతోంది. గతంలో పెద్ద ఎత్తున ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేసింది. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. దీనికితోడు 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో టీకా కొరత ఏర్పడింది. అయితే రానున్న రోజుల్లో భారీ స్థాయిలో టీకా ఉత్పత్తి దేశంలోనే జరుగనుందని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ అంచనా వేసింది. వీటిలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన సింగిల్ డ్రాప్, సింగిల్ డోస్ నాసల్ వ్యాక్సిన్లు కూడా ఉంటాయని వివరించారు.
ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్లతో కేంద్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ బదిలీ ద్వారా భారతీయ కంపెనీలతో పనిచేయాలని వాటిని ఆహ్వానిస్తున్నామన్నారు అధికారులు. 45 ఏళ్లు నిండినవారిలో దేశంలో సగటున 32 శాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ అందింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వచ్చే వారమే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జులై నుంచి భారత్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 45 ఏళ్లు నిండినవారిలో దేశంలో సగటున 32 శాతం మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ అందింది.
కోవిషీల్డ్ 75 కోట్లు, 55 కోట్లు, బయలాజికల్ ఈ టీకా 30 కోట్లు, సీరమ్ ఇన్స్టిట్యూట్ నోవావ్యాక్స్ 20 కోట్లు, స్పుత్నిక్-వీ 15.6 కోట్లు ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు భారత్ బయోటెక్ నాసల్ టీకా 10 కోట్లు, జెన్నోవా ఎంఆర్ఎన్ఏ టీకా 6 కోట్లు, జైడస్ కాడిల్లా డీఎన్ఏ టీకా 5 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. బయలాజికల్-ఈ, జైడస్, జెన్నోవా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ పలు దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలోని ప్రజలకు అవసరమైన టీకాలు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
ఇప్పటివరకు దేశంలో దాదాపు 18 కోట్ల డోసులు అందజేశారు. జులై నాటికి ఇది 35.6 కోట్లకు చేరుతుందని వీకే పాల్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. దేశంలో ఇప్పటివరకు 13.76 కోట్ల మంది తొలి డోస్, 3.96 కోట్ల మంది రెండో డోస్ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటినవారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా, వారిలో ఒకటి బై మూడో వంతు మందికి ఒక డోస్ అందింది. కొవిడ్ మృతుల్లో 88 శాతం మంది ఈ వయస్సు వాళ్లే కావడం వల్ల వీరికి టీకాను ఇవ్వడం వల్ల మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి.
అలాగే ఇప్పటివరకు 35.6 కోట్ల డోస్లను కొనుగోలు చేశాం… వీటిలో 19.6 కోట్ల వినియోగం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుందని నీతి ఆయోగ్ సభ్యులు వీకె పాల్ తెలిపారు. మిగిలిన 16 కోట్ల డోసులు మే నుంచి జులై మధ్యలో అందుతాయన్నారు. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి సేకరిస్తున్నాయని చెప్పారు. మొత్తంగా జులై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారాయన. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల సేకరణకు గ్లోబల్ టెండర్లను ఏపీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఆహ్వనించాయి. దీంతో పాటు మోడర్నా, ఫైజర్ టీకాలు కొనుగోలు చేసుకునేందుకు ఇప్పటికే కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. అయితే విదేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్లు కసౌలీలోని ల్యాబ్లో టెస్టు చేసిన తర్వాతే వాడాల్సి ఉంటుంది. మరి ఇది ఎప్పటికి సాకారమవుతుందో చూడాలి.