కరోనా పరిశోధనల్లో మరో అడుగు

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బాగుంటే కరోనాను జయించినట్టే. ఈ వ్యవస్థ తగినంతగాలేకుంటే అలాంటివారికి యాంటీబాడీలు ఇచ్చి రోగ నిరోధక శక్తి పెంచుతుంటారు. ఒకవేళ యాంటీ బాడీలు ఇచ్చినా సరిపోకపోతే ఏం చేయాలి? దీనిపై అమెరికాలోని బేత్ ఇజ్రాయెల్ డియాకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. తెల్లరక్త కణాల్లో ఉండే టీ కణాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని నిర్ధరించారు. తొలుత కోతులపై ప్రయోగాలు చేసి దీనిని రుజువు చేశారు. ప్రస్తుతం తొలి తరం కరోనా టీకాల తయారీ జరుగుతుండగా, రెండో తరం టీకాల రూపకల్పనలో ఈ ప్రయోగం ఉపకరిస్తుందని పరిశోధనకు ఆధ్వర్యం వహించిన ప్రొఫెసర్ డాన్ బరౌచ్ తెలిపారు. యాంటీబాడీలు ఆధారంగా చేసే చికిత్సల విషయంలోనూ దీన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. యాంటీబాడీలు, టీ కణాల పనితీరును నిశితంగా పరిశీలించామని తెలిపారు. యాంటీబాడీల స్థాయి తగ్గినప్పుడు టి కణాలు వాటి లోటును భర్తీ చేస్తాయని చెప్పారు. అలాంటప్పుడు టి కణాలపై ప్రభావం చూపే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా మందులు తయారు చేసినప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని అన్నారు.