కరోనా కట్టడా…లేక కరోనా సమాచార కట్టడా ??
ఇంతింతై వటుడింతై అన్నట్టు కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. లాక్ డవున్తో సహా చేపట్టిన పలు జాగ్రత్తలు దాని విస్త్రుతికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అయోమయంలో పడినట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనంగా కరోనాని నియంత్రించడం ఎలా అనే ఆలోచనకు బదులుగా మీడియాకు సమాచారం అందకుండా చేయాలని అనుకుంటున్నట్టు ఉంది. గత కొన్ని రోజులుగా కరోనా మరింతగా జడలు విప్పుతున్న పరిస్థితుల్లో మీడియాకు అధికారికంగా సమాచారం ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోంది.
సుప్రీం ఏం చెప్పింది?
కరోనాపై ఏదైనా సమాచారాన్ని ఇవ్వాలన్నా, గణాంకాలను ప్రజలకు తెలియజేయాలన్నా, కేవలం సంబంధిత ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే తెలియజేయాలన్నది మార్చి చివరి వారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం. మహమ్మారిపై స్వేచ్ఛగా చర్చలు జరిపి సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని, ఈ విషయంలో తాము కల్పించుకోలేమని స్పష్టం చేస్తూ, కేసుల విషయంలో మాత్రం అధికారిక సమాచారాన్నే ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిత్యమూ మీడియా బులెటిన్ లను విడుదల చేయాలని, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది.
తొలుత సై…ఆనక నై…
సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి నిత్యమూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను మీడియాకు తెలిపేందుకు సమావేశాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే సరిగ్గా కేసుల సంఖ్య భారీగా పెరిగే సమయానికి మీడియా సమావేశాలను నిలిపివేసింది. గత మే 11న కేసులు 67,152కు చేరిన తరువాత మీడియా సమావేశాలు అకస్మాత్తుగా నిలిపివేసి, కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితమైంది. అలా కొన్ని రోజులు ప్రకటనల జారీకి పరిమితమైన తర్వాత ఇప్పుడు కేసుల సంఖ్య లక్షను అధిగమించిన వేళ, ఆ మాత్రం సమాచారాన్ని కూడా ఇవ్వడానికి వెనుకంజ వేస్తోంది. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య శాఖ అధికారులు సైతం మీడియాకు ముఖం చాటేయడం ప్రారంభించారు. అంతేకాదు…ఏప్రిల్ 25కు ముందు వరకూ ల్యాబ్ ల నుంచి సేకరించిన కరోనా పరీక్షల గణాంకాలను విడుదల చేస్తూ వచ్చిన ఐసీఎంఆర్, ఆపై ఆ వివరాలను కూడా మీడియాకు అందించడం మానేసింది. గత మే 10 నుంచి రాష్ట్రాల వారీగా కరోనా గ్రాఫ్ లను హెల్త్ మినిస్ట్రీ వెబ్ సైట్ నుంచి తొలగించారు.
ప్రజలకు కరోనా వ్యాప్తిపై సమాచారం అందని పరిస్థితి నెలకొంది. తక్షణమే కేంద్రం స్పందించి, వాస్తవాలను తెలిపేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇదే విషయమై ఆరోగ్య శాఖను వివరణ కోరగా, మీడియా సమావేశాలకు బదులుగా ప్రకటనలు విడుదల చేయాలన్నది విధానపరమైన నిర్ణయమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నిత్యమూ ప్రభుత్వం తరఫున వివరాలను అందిస్తున్నామని ఏమీ దాయడం లేదని తెలిపారు.






