అఫ్ఘాన్లో ట్రంప్ ఆకస్మిక పర్యటన
తాలిబన్లతో తమ శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. థ్యాంక్స్ గివింగ్ రోజును పురస్కరించుకొని ఆయన అఫ్గానిస్థాన్లో ఆకస్మికంగా పర్యటించారు. బగ్రామ్ వైమానికి క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. మేం వారితో సమావేశమవుతున్నాం. కాల్పులను విరమించాలని చెబుతున్నాం. గతంలో అందుకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం సరేనంటున్నారు. కాబట్టి సానుకూల ఫలితం ఉంటుందనుకుంటున్నా అని చెప్పారు. అఫ్గాన్లో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో అమెరికా సైనికుడొకరు మృత్యువాతపడటంతో తాలిబన్లతో శాంతి చర్చలను రద్దు చేస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ట్రంప్ ప్రకటించారు. ఆఫ్గాన్లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు అష్రాప్ ఘనీతో ట్రంప్ భేటీ అయ్యారు. శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయన్న విషయంపై తామిప్పుడే స్పందించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.













