కువైట్ లో ఘనంగా మినీ మహానాడు – ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రమేష్
ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ కువైట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మినీ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సి.ఎం రమేష్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగేళ్లలోనే సాధించిండం జరిగిందని తెలిపారు. అసమాన విభజన కారణంగా 13జిల్లాల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తోడ్పాటు లేకున్నా స్వయంకృషితో గత నాలుగేళ్లలో రెండంకెల వృద్ధి సాధించగలిగామంటే కారణం ముఖ్యమంత్రి కృషేనని కొనియాడారు.
చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. రాబోయే 15 సంవత్సరాల పాటు ఇదే రెండంకెల వృద్ధి సాధించేందకు ముఖ్యమంత్రి పటిష్టమైన ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంటకుంటలు తవ్వడమే కాకుండ వేలాది చెరువుల్లో పూడిక తీయడంతో పాటుగా, చెరువు కట్టలు పటిష్టం చేశామని ఫలితంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ మాత్రమే ఉండేదని నేడు పచ్చటి పంట పొలాలతో సీమ ప్రాంతం కళకళాడుతోందన్నారు. ఎడారి జిల్లాగా మారిన అనంతపురం జిల్లాలో నేడు వరి ధాన్యం పండించే స్థాయికి సీమ రైతాంగం వచ్చిందన్నారు. రాయల సీమను హార్టీకల్చర్ హబ్గా మార్చమని తద్వారా నేడు రైతాంగం సంతోషంగా ఉందన్నారు. మినీ మహానాడును విజయంతం చేసినట్లే ఈ నెల విజయవాడలో జరిగే మహానాడులో అందరూ పాల్గొన్ని విజయంతం చేయాలని కోరారు.
వేదాలయ అకాడమీ అభివృద్ధికి రూ.5 లక్షల విరాళం
ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో వేదాలయ అకాడమీ చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలకు ముగ్ధులైన రాజ్యసభ సభ్యులు సి.ఎం రమేష్ రూ.5 లక్షలు అకాడమీ అభివృద్ధికి విరాళాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కువైట్ ప్రవాసాంధ్ర టీడీపీ అధ్యక్షుడు ములక సుబ్బారాయుడు, వర్కింగ్ ప్రెసిడింట్ మాలేపాటి సురేష్బాబు, వెంకట్ కోడూరి, వీ.పీ ఉదయ్ప్రకాష్, జీఎస్.ఎండీ బోర్ర, అర్గనేజర్ సెక్రటరీ దివాకర్ వోలేటి, తెలుగుదేశం నాయకులు కూరపాటి వెంకటేష్, పేరం రమణ, పాలేటి ప్రసాద్, జిలకర్ర మురళీ, హరి, రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ తరుపున టీడీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, దేవినేని అవినాష్, కె.కె.చౌదరి, ఎల్.వి.రమణ, కట్టా బాలాజీ, విశ్వనాథనాయుడు, కదిరి శాసనసభ్యులు అత్తర్ చాంద్ బాషా మరియు తెలుగుయువత నాయకులు మల్లి తదితరులు కువైట్లో జరిగిన మినిమహానాడులో పాల్గొన్నారు.













