దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో ట్రంప్, భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. భారత- అమెరికన్ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గరవంగా భావిస్తున్నట్ల ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులు. ప్రధాని మోదీతో తనకు బలమైన బంధం ఉందని అన్నారు. మన భారత-అమెరికన్ సోదరులు, మిత్రులు అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు.
అమెరికాలోని సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. పీపుల్స్ హౌస్లో దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద కోట్ల మంది భారతీయులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అన్నారు. అమెరికాలో సుమారు 20 లక్షల మంది భారతీయులు దీపావళి జరుపుకంటున్నారన్నారు. బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్.
ఈ వేడుకల్లో ఐరాసకు చెందిన అమెరికా రాయబారి నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్, ట్రంప్ కూతురు ఇవాంకా తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు.













