అమరావతి రైతుల ఆందోళనకు మా మద్దతు పలకాలి – మాధవీలత
అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న రైతుల ఆందోళనకు సినీనటులంతా మద్దతు పలకాలని సినీనటి, బిజెపి నాయకురాలు మాధవీలత కోరారు. ఈ మేరకు ఆమె ఓ వినతిపత్రాన్ని మా అధ్యక్షుడు నరేష్కు అందజేశారు. అమరావతి రాజధానిగా ఉండాలన్న ఆశయంతో గత ప్రభుత్వహయాంలో రైతులు తమ విలువైన భూములను రాజధానికోసం త్యాగం చేశారని, నేడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనవైపు మొగ్గు చూపడంతో రైతుల్లో ఆందోళన నెలకొందని ఆమె చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు గత కొద్దిరోజులుగా ఉద్యమాలు చేస్తున్నారని, ఈ ఉద్యమాలకు సినీనటులు కూడా మద్దతు పలకాలని కోరుకుంటున్నట్లు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. సేవ్ అమరావతిపేరుతో ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్ళంతా ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారని, సినీ నటీనటులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికేలా చూడాలని మా అధ్యక్షుడు నరేష్ను ఆమె కోరారు.













