మలయాళం సినీ పరిశ్రమ లో పోస్ట్ ప్రొడక్షన్స్ స్టార్ట్ చే స్తున్నారహో!
దాదాపు రెండు నెలల బ్రేక్ తర్వాత మలయాళీ సినీ పరిశ్రమలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి విషయం తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సినీ, సీరియల్ షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీలో పనిచేసే రోజువారీ కార్మికులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఇండస్ట్రీకి సైతం నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ సాంస్కృతిక శాఖా మంత్రి ఏకే బాలన్.. సినీ పరిశ్రమ గురించి ముఖ్యమంత్రితో శనివారం చర్చించారు. అనంతరం మే 4వ తేదీ నుంచి సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవచ్చు అని సూచించారు.
కాగా, ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొనే బృందంలో ఐదు లేదా ఆరుగురు మాత్రమే ఉండాలని తెలిపారు. అంతేకాకుండా డబ్బింగ్, రికార్డింగ్, రీ రికార్డింగ్ పనుల్లో పాల్గొనే ముందు సదరు స్టూడియోను పూర్తిగా పరిశ్రుభం చేయాలని ఆదేశించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో పాల్గొనే వాళ్లందరూ తప్పకుండా మాస్క్లు ధరించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. బాలన్ ఇచ్చిన ఆదేశాల మేరకు నేడు మాలీవుడ్లో పలు సినిమాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి.













