అన్నమాచార్యుల 618వ జయంతి సందర్భంగా విశ్వశాంతి సంకీర్తనాయజ్ఞం
తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యులు వారి 618వ జయంతి సందర్భంగా, పద్మశ్రీ డా. శోభారాజు గారు స్థాపించిన అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో మే 2, 2026 ఉదయం 7:30 గం.లకు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్నమాచార్యుల విగ్రహం వద్ద విశ్వశాంతి సంకీర్తనాయజ్ఞం భక్తిభావంతో వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు, అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా 100 మందికి పైగా శిక్షణ పొందిన గాయనీ గాయకులు కలిసి అన్నమాచార్యుల సంకీర్తనలను బృందంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచ శాంతి కోసం చేసిన సంకీర్తనాలాపన విశేషంగా అలరించింది.
ఈ కార్యక్రమానికి ముందు, ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు శోభా రాజు గారు స్వయంగా ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించి, 100 మందికి పైగా విద్యార్థులకు అన్నమాచార్యుల సంకీర్తనా శిక్షణ అందించారు. సేవాభావంతో పూర్తిగా ఉచితంగా నిర్వహించిన “వేసవి వెన్నెల” ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గానంతో అలరించారు. అన్నమాచార్య సంకీర్తనా ప్రచారాన్ని రాబోవు తరాలకు అందించే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రశంసించారు.

ముఖ్య అతిథులుగా తిరుపతి శ్రీశక్తి పీఠానికి చెందిన శ్రీ రామానంద భారతి స్వామి వారు విచ్చేసి వారి దివ్య ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ న్యాయమూర్తి జి. రాధా రాణి గారు ఈ కార్యక్రమాన్ని సమాజంలో శాంతిని పెంపొందించే గొప్ప ప్రయత్నంగా అభివర్ణించారు. కె. హనుమంతరావు గారు శోభారాజు గారి సేవలను కొనియాడారు. తాడేపల్లి పంతంజలి గారు అన్నమాచార్యుల కీర్తనలను పరిరక్షించడంలో శోభారాజు గారు చేస్తున్న కృషిని కొనియాడగా, చెన్నూరి సుబ్బారావు గారు మాట్లాడుతూ శోభారాజు గారు మాత్రమే అన్నమాచార్య సంకీర్తనా ప్రచారాన్ని 40 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారని శ్లాఘించారు.
శోభారాజు గారు మాట్లాడుతూ అన్నమాచార్యుల కీర్తనాలాపన ప్రపంచ శాంతి కలుగుతుందని, “సకల శాంతి కరము” అనే కీర్తన ప్రస్తుతం ఉన్న పరిస్థుతులు చక్కబడటానికి ఉపకరిస్తుందనీ, అన్ని వయసుల వారు కలిసి ఈ కీర్తనను ఆలపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సంగీత కార్యక్రమంలో విద్యార్థులు బృందగానం చేశారు. “హరి అవతారమీతడు,” “అప్పని వరప్రసాది,” “తందనానా,” “సకల శాంతి కరము” వంటి కీర్తనలు ఆలపించారు. కీబోర్డ్ పై రాజు, తబలాపై రమేష్ సహకారం అందించారు.
చివరిగా అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు, భక్తులు, అతిథులకు అన్నదాన వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.






