సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
స్థానిక తెలుగు వారికి ఉచిత వైద్య సేవలు
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లోని మహాత్మా గాంధీ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. సమాజ సేవలో భాగంగా మిస్సోరీ నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ఈ వైద్య శిబిరంలో నాట్స్ మెడికల్ డైరెక్టర్, అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి తన విలువైన సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు.. నిపుణులైన వైద్యుని నుంచి ఉచితంగా వైద్య సేవలు అందడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో నాట్స్ ప్రస్తుత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నాట్స్ నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర గారు కీలక పాత్ర పోషించారు. మిస్సౌరీ చాప్టర్ బృందంతో పాటు వలంటీర్లు ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి ఈ శిబిరం విజయవంతం కావడంలో తమ వంతు కృషి చేశారు. నాట్స్ మిస్సోరీ చాప్టర్ నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.








