తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక విజ్ఞప్తి …రాబోయే రోజుల్లో
తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో రెంజి 2026 సదస్సు జరిగింది. క్లీన్ ఎనర్జీ, స్టార్టప్స్, ఇంధన పాలసీలపై దేశవ్యాప్తంగా ప్రతినిధులతో లీడర్షిప్ ఫోరమ్ నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. పీఎం సూర్యఘర్ యోజన, ఎనర్జీ పాలసీపై చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేందుకు సోలార్ విద్యుత్ (Solar electricity) ను ప్రోత్సహించాలని సూచించారు. దేశ ప్రజలకు విద్యుత్ సోలార్ ఎస్టాబ్లిష్ మెంట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 70 శాతం వరకు రాయితీలు ఇస్తోందని వ్యాఖ్యానించారు.
గ్రీన్ ఎనర్జీ కోసం కొత్త కంపెనీలు హైదరాబాద్ (Hyderabad) కి రావడం శుభసూచకమని పేర్కొన్నారు. కోల్ ద్వారా 73శాతం పవర్ వస్తోందని వివరించారు. గ్రీన్ ఎనర్జీ కోసం అందరం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఇంధన రంగంలో భారత్ స్వయంసమృద్ధి దిశగా వెళ్తుందని చెప్పుకొచ్చారు. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, ఎక్కడా కరెంట్ కొరత లేదని ప్రస్తావించారు. యూపీఏ (UPA) హయాంలో పవర్ గ్రిడ్ కుప్పకూలిందని, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడు ఇంధన ఉత్పత్తిదారుడిగా మారాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రూ.10 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర సంస్థలు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.







