గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం పరీక్ష జరిగింది. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్తారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్కు టీఎస్పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్-1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే.













