ఈ నెల 25న తెలంగాణ బడ్జెట్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న శాసనసభలో ప్రవేశపెట్టనుంది. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించింది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.
గత పదేళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5 శాతం వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్కు నిధులు కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా.