Cabinet Meeting: జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షతన జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయం(Secretariat) లో జరగనుంది. రైతు భరోసా, భూమిలేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించే అవకాశముంది. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త రేషన్ కార్డుల(New ration cards ) కు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై చర్చించే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల అసెంబ్లీలోనూ చర్చించారు.