వైఎస్ జగన్, కేసీఆర్, చంద్రబాబు సహా ముఖ్యనేతలకు.. రేవంత్ ఆహ్వానాలు
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు తెలంగాణ పీసీసీ ఆహ్వానాలు పంపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలను రేవంత్ రెడ్డే ఢిల్లీ వెళ్లి స్వయంగా ఆహ్వానించారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానాలు పంపారు. సీనియర్ నేతలు చిదంబరం, అశోక్ గహ్లోత్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మీరాకుమార్, కుంతియా, భూపేష్ బఘేల్, అశోక్ చవాన్, వాయలార్ రవి, సుశీల్కుమార్ శిండే, మాణికం ఠాగూర్, కురియన్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రములులకు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఆహ్వానాలు పంపారు.













