Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన

నాగర్కర్నూల్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్-2 (Group-2) పరీక్ష రాశారు. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (Revathi) నాగర్కర్నూల్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ సిబ్బంది, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందుకు ఆమె అంగీకరించలేదు. పరీక్ష రాస్తానని చెప్పారు. ఆమె కాన్పు తేదీ ఇవాళే కావడంతో అందరూ కాస్త ఆందోళనకు గురయ్యారు. అయినా, ఆమె పట్టు వదలకుండా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ (Santosh) దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం పరీక్ష కేంద్రంలో 108 అత్యవసర వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆమెకు ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా, ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉంచారు. రేవతి భర్త, ఆమె తల్లి అందుబాటులో ఉన్నారు.