టీ సేవ్ నిరాహార దీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
టీ-సేవ్ నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందిరాపార్కు వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టే నిరాహార దీక్షకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ పాల్గొనవద్దని, దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీల అధ్వర్యంలో ఈ దీక్ష సాగనుంది.
నిరుద్యోగ యువతకు మద్దతుగా నిర్వహించదలచిన అఖిలపక్ష నిరాహార దీక్షకు అనుమతి మంజూరు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న నిర్వహించదలచిన నిరాహార దీక్షకు అనుమతిని నిరాకరిస్తూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ షర్మిల పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో నిరుద్యోగ యువతకు మద్దతుగా ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష నిరహార దీక్షకు అనుమతిని కోరుతూ పోలీసులకు వినతిపత్రం సమర్పించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది.













