వరంగల్ మహిళకు అరుదైన అవకాశం
వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్ షాహిన్ బేగంకు అరుదైన అవకాశం లభించింది. గత కొద్ది రోజుల నుంచి వివిధ వర్గాల ప్రజలను నేరుగా పలుకరించేందుకు ప్రధాన మంత్రి జన్ సంవాద్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) వర్గానికి చెందిన మహిళలతో ముచ్చటించారు. ఈ క్రమంలో మోదీతో ముచ్చటించే అవకాశం కౌసర్ షాహిన్కు లభించింది. ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కౌసర్ ప్రధానితో ముచ్చటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు పొదుపు పాఠాలు చెప్పిన కౌసర్, ఎంతో మంది మహిళలకు అమె శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ నేడు దేశవ్యాప్తంగా ఆమెకు ఖ్యాతిని పెంచింది. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నానని కౌసర్ తెలిపారు.













