కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి : రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లాల్లో పర్యటించిన సీఎం మంత్రులతో కలిసి వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని వెల్లడిరచారు. సహాయచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం తగ్గించగలిగాం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాం. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలి. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించాం. తక్షణమే రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలన్నారు.
ఎంత ఒత్తిడి ఉన్నా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నాం. ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. ఆక్రమణలకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయి. పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదు. పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్రావు డిమాండ్ చేయగలరా? ఆక్రమణలు తొలగింపునకు హరీశ్రావు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారా? చెరువులను ఆక్రమించిన వారు ఎంతటివారైనా తొలగించాల్సిందే. ఆక్రమణల తొలగింపునకు విధివిధానాలు రూపొందించాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.