వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్! ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, జీవో విడుదల
తాతల, తండ్రుల కాలం నుంచి తరతరాలుగా గ్రామాల్లో సహాయకులుగా పనిచేస్తున్న వీఆర్ఏ లకు ‘పే స్కేలు’ అమలు పరుస్తూ, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ఆదివారం నాడు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈరోజు సచివాలయంలో జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని సీఎం తెలిపారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని విఆర్ఏలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. విఆర్ఎల క్రమబద్ధీకరణను వీరంతా అభినందిస్తున్నారని సీఎం అన్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న విఆర్ఏలందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు.
10వ తరగతి అర్హత కలిగిన వారు 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందని తెలిపారు. మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారికి, వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం స్పష్టం చేశారు. విఆర్ఏల జెఏసి ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామని, ఈ ఆర్డర్ లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం తెలిపారు.
“వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుంది. విఆర్ఏలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు” అని సీఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా డిపార్ట్ మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నానని సీఎం వారికి సూచించారు. మంత్రి శ్రీ కేటీఆర్ ఈ ప్రక్రియ తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ తీసుకున్నందున కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉత్తర్వులిస్తే బాగుంటందని సూచించి, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు వారికి సీఎం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.













